
సామాజిక సందేశంతో ఆకట్టుకున్న నాటికలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలవారీ నాటక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం రెండు సందేశాత్మక నాటికలను ప్రదర్శించారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, నాంచారయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ప్రదర్శనగా స్నిగ్ధ కలం నుంచి జాలువారిన ‘దోషేచ వహ్ని’నాటిక ప్రదర్శించారు. మధ్యతరగతి కుటుంబాల్లో కుమార్తెను అత్తవారింటికి పంపిన తర్వాత, ఆ తల్లిదండ్రులు సర్వం కుమార్తెకు ధారపోస్తూ, కోడలి వేదనను పట్టించుకోని ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయినేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి’ అనే ఆరు సూత్రాలను పాటిస్తూ జీవించే సీ్త్ర పాత్రను ఈ నాటిక స్పృశించింది. అయితే భర్త తప్పు చేసినప్పుడు.. సప్తమ సూత్రంగా ‘దోషేచ వహ్ని’ అని సీ్త్ర చైతన్యవంతురాలై తనకు తానుగా లిఖించుకోవాలి అన్న సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథాంశానికి తగ్గట్టుగా నటీనటుల చక్కని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రెండవ నాటికగా కెరటాలు ప్రదర్శించారు. భాగవతుల రమాదేవి రచించిన ‘కెరటాలు’కథకు మునిపల్లె విద్యాధర్ నాటకీకరణ చేశారు. ఆధునిక భావాలతో నేటి యువత, ముఖ్యంగా మహిళలు తమ తల్లిదండ్రులను, ఆ తర్వాత భర్తను కూడా ఎదిరించడమే అభ్యుదయంగా భావించి తమ జీవితాలను, భవిష్యత్ను భగ్నం చేసుకుంటున్నారు. అలాంటివారు కెరటాల్లో కొట్టుకు పోకుండా.. గతంలో కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఒడ్డుకు చేరాలనే సందేశమిస్తూ ఈ నాటిక సాగింది. ఈ రెండు నాటికలను రాజాం కళాక్రియేషన్స్ సంస్థ ప్రదర్శించింది.