
రైతులను మోసగించిన ఎంపీ రమేష్
దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సహా కూటమి నాయకులు ఘోరంగా మోసం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాగా ఒకప్పుడు సహకార రంగంలో రోల్మోడల్గా నిలిచి, నేడు శిథిలావస్థకు చేరుకున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోక పోవడం అత్యంత దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార రంగంలో నడుస్తున్న ఫ్యాక్టరీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం రైతులను మోసగించడమేనన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో అత్యధికంగా వరి, చెరకు పండిస్తుండగా కూటమి నాయకులు మాత్రం డిస్టలరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో రూ.89 కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 2023–2024 సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు ఇంకా చెల్లించాల్సిన రూ.150 అందరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 2024–25 సీజన్లో లక్షా 7వేల టన్నుల చెరకు క్రషింగ్ జరపగా, దీనిలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు మాత్రమే తొలి దఫా పేమెంట్గా టన్నుకు రూ.3వేలు చొప్పున చెల్లించారన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 10 వరకు క్రషింగ్ జరిగినా రైతులకు ఇంకా పేమెంట్ల ఇవ్వలేదన్నారు. ఫ్యాక్టరీ భవిష్యత్ అంధకారంగా ఉందని, నెలల తరబడి కార్మికులకు జీతాలు, రైతులకు పేమెంట్లు ఇవ్వకపోవడంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ చెరకు రైతులను దారుణంగా మోసం చేసిన ఎంపీ రమేష్, కూటమి నాయకులు నిస్సిగ్గుగా ప్రజల్లో తిరుగుతున్నారని ఘాటుగా విమర్శించారు. రైతులను మోసగించిన నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు.
కూటమి పాలనలో దయనీయంగా
చెరకు రైతులు, కార్మికుల పరిస్థితి
గత ప్రభుత్వ హయాంలో రూ.89 కోట్ల నిధులు
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
వెంకన్న ధ్వజం