
జూలై 9న గిరి ప్రదక్షిణ
సింహాచలం: సింహాచలం క్షేత్రంలో జూలై 9న గిరి ప్రదక్షిణ ఉత్సవం జరగనుందని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామన్నారు. గిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహణపై శుక్రవారం దేవస్థానం వైదికులు, ఇంజినీరింగ్ అధికారులు, సెక్షన్ హెడ్లతో ఈవో ముందస్తు సమీక్ష నిర్వహించారు. జూలై 9న 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు, అలాగే జూలై 10న ఆలయ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని ఈవో అంచనా వేశారు.
భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు
భక్తుల సౌకర్యార్థం కొండచుట్టూ స్టాల్స్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు విషయంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులకు ముందుగానే లేఖలు రాయాలని సూచించారు. జీవీఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గిరి ప్రదక్షిణ ఉత్సవంలో దాతల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఈవో పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, మంచినీటి సదుపాయాల కోసం జీవీఎంసీ సహకారం తీసుకుంటామన్నారు. సమావేశంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో ఎస్.రాధ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఈఈ రాంబాబు, ఏఈవోలు రమణమూర్తి, ఆనంద్కుమార్, పిల్లా శ్రీనివాసరావు, పంతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు కె.మూర్తి, రాజ్యలక్ష్మి, సునీల్, పద్మనాభరాజు, త్రిమూర్తులు, పీఆర్వో నాయుడు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై దేవస్థానం ఈవో త్రినాథరావు సమీక్ష