
అచ్యుతాపురం సైబర్ కేసు సీఐడీకి అప్పగింత!
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఈ కేసులో మరింత పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసు అమెరికాతో పాటు వివిధ దేశాలతో ముడిపడి ఉన్నందున మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కేసు సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రటించాల్సి ఉంది. నిందితులను పట్టుకున్న పవన్ రెసిడెన్సీని ఈ నెల 22న సీఐడీ ఎస్పీ సందర్శించినట్టు సమాచారం.
కింగ్ పిన్ హైదరాబాద్ ఓల్డ్సిటీలో..
అంతర్జాతీయ పరిశ్రమలు ఉండే అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో అంతర్జాతీయ సైబర్ కార్యకలాపాలు నిర్వహించే సైబర్ డెన్కు సంబంధించి కింగ్పిన్ హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఓ వ్యక్తి ద్వారా రిక్రూట్ చేసి మ్యాన్పవర్ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పవన్ రెసిడెన్సీలో ఉన్న కాల్సెంటర్లో పనిచేసే ఉద్యోగుల్లో కొంత మందిని గుజరాత్ రాష్ట్రంలో రిక్రూట్ చేస్తే..మరికొందరినీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ వేదికగా రిక్రూట్ చేసి పంపించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలని చెప్పి ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యత ఉన్న యువతీ,యువకులను రిక్రూట్ చేస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో లోతైన విచారణ