
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపునకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీజేఏసీ) అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక న్యూకాలనీ పాలూరి చిదంబరం మెమోరియల్ హాల్లో శుక్రవారం రెవెన్యూ సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు ఉద్యోగులు మూడు పీఆర్సీలు కోల్పోయారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కూటమి ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలో శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్నామన్నారు. ప్రతి ఏడాది 10 వేల నుంచి 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని, వీరికి బకాయి పడ్డ రూ.6 వేల కోట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు రూ.20 వేల కోట్లు బకాయి ఉందని, వీఆర్వో గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 2023 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే నగదు చెల్లించి వైద్యం పొందే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించే వారని, పది సంవత్సరాలుగా ఇది జరగడం లేదన్నారు. ఉద్యోగులకు నేటి వరకూ డీఏ రూ.1100 కోట్లు, సరెండర్ లీవ్లు రూ.3 వేల కోట్లు, జీపీఎఫ్ రూ.500 కోట్లతో పాటు ఇతర అలవెన్సుల బకాయి ఉన్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బకాయి ఉందో పే స్లిప్పై నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎస్సీ జిల్లా కార్యదర్శి వై.శ్రీరామ్మూర్తి, అధ్యక్షుడు వి.రత్నం, జిల్లా నాయకులు వాసు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు
చెల్లించాలి
ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు