
మీకు దండాలు.. దయచేసి చదువును దూరం చేయొద్దు
కోటవురట్ల: విద్యా శాఖామంత్రి లోకేష్ గారూ.. మా పిల్లలకు చదువులు అవసరం లేదా..గిరిజన పిల్లలు చదువుకు దూరంకావలసిందేనా..ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు.. మా పిల్లల కోసం ఓ ఉపాధ్యాయుడిని నియమించలేరా అంటూ అణుకు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ దండం పెడుతూ ఆందోళన చేశారు. అణుకు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆదివారం ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడిని నియమించాలని నినాదాలు చేశారు. పార్టీ మండల కార్యదర్శి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ గ్రామానికి గత ప్రభుత్వంలో రోడ్డు వేసి, ప్రత్యామ్నాయ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించారన్నారు. కూటమి ప్రభు త్వం వచ్చాక ఉపాధ్యాయుడిని తొలగించారని, దీంతో చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సుమారు 60 మంది పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వర్షాలకు రోడ్డు కూడా శిథిలమైందని, పిల్లలు రాళ్లు తేలిన రోడ్డుపై చదువు కోసం 12 కిలోమీటర్లు రానుపోను నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యా శాఖా మంత్రి ,కలెక్టర్ స్పందించి గిరిజన బాలల కోసం పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారు. సీపీఎం నాయకులు ఎం.నానాజీ, ఎం.సూరిబాబు, రఘుబాబు, నర్సింగరావు, నవీన్ పాల్గొన్నారు.