
జీడితోటలో 80 కేజీల గంజాయి స్వాధీనం
అనకాపల్లి : రోలుగుంట మండలం కొవ్వూరు నుంచి కంతలం గ్రామాల మధ్యలో జీడితోటలో 80 కేజీల గంజాయి నిల్వ చేసినట్టు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి అన్నారు. కొత్తూరు పంచాయతీ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీడితోటల్లో తనిఖీలు నిర్వహించగా 60 కేజీల గంజాయి నిల్వ చేసినట్టు గుర్తించారని, మరో 20 కేజీల గంజాయిని తీసుకుని అక్కడ దాచేందుకు వచ్చిన నర్సీపట్నం పట్టణానికి చెందిన కుంచా యేసుక్రాంతి, రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఎర్ర పవన్ కుమార్లు పోలీసులను చూసి వెనుదిరిగి వెళుతూ పట్టుబడ్డారని తెలిపారు. వారిని విచారించగా అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం శిరిపురం గ్రామానికి చెందిన బూరిటీ శ్రీను నుంచి గంజాయిని కొనుగోలు చేసి కొవ్వూరు–కంతలం గ్రామాల మధ్య జీడితోటలో భద్రపరిచినట్టు తెలిపారన్నారు. నిందితుల వద్ద మూడు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని నగదు ప్రోత్సాహంతో అభినందించారు.
ముగ్గురు అరెస్టు, రిమాండ్