
ఏపీఐఐసీ భూముల పరిశీలన
నక్కపల్లి: మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో జరుగుతున్న పనులను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం పరిశీలించారు. వేంపాడు, చందనాడ, డీఎల్పురం, అమలాపురం, రాజయ్యపేటలలో 2000 ఎకరాలు బల్క్ డ్రగ్ పార్క్కు, 2500 ఎకరాలు ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు కేటాయించిన విషయం తెలిసిందే. రూ.1100 కోట్ల వ్యయంతో ఈ భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి యువరాజ్ ఈ ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించారు. జిరాయితీ ఎంత, డీ ఫారం ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనే వివరాలు అధికారులు వివరించారు. గతంలో ఆయన ఉమ్మడి విశాఖ కలెక్టర్గా ఉన్న సమయంలోనే భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు వంటి ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ పునరావాస కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి లేఅవుట్ సిద్ధం చేసి నిర్వాసితులకు అప్పగించాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీవో రమణ, ఎస్డీసీ అనిత, తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
అంత గోప్యత ఎందుకో?
పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ పర్యటనపై రైతులు, నిర్వాసితులకు కనీస సమాచారం లేదు. పూర్తిగా అధికారిక పర్యటన అయినప్పటికీ స్థానిక అధికారులు గోప్యంగా ఉంచారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని రైతులు, నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధిత రైతులు ఎక్కడ ఆయన కాన్వాయ్ను అడ్డుకుని తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే పర్యటనను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకు వచ్చేవారమని, ఎవరికీ కనీస సమాచారం లేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తెలిపారు.
వివరాలు తెలుసుకున్న పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్
ఉన్నతాధికారి పర్యటన గోప్యంగా ఉంచడంపై నిర్వాసితుల్లో అసంతృప్తి