
20 ఏళ్లకు పైబడి ఒకేచోట..
నాతవరం: వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001–02 సంవత్సరంలో ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలను నియమించారు. ఆనాటి నుంచి 2024 వరకు వీరు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులర్ చేశారు. వీరు రెగ్యులరైజ్ అయి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ప్రస్తుతం తలపెట్టిన సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు కావడంతో గతంలో బదిలీలకు చాన్స్ దక్కలేదు. ఇప్పుడు రెగ్యులర్ అయి ఏడాది మాత్రమే అయిందంటూ అన్యాయం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పీహెచ్సీలలో ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు 65మంది వరకు 20 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. వీరు బదిలీల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నాతవరం పీహెచ్సీలో ఫార్మసిస్టు వెంకటరావు 23 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదే మండలం గునుపూడి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎం 22 ఏళ్లుగా, పాయకరావుపేట మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఫార్మసిస్టు 24 ఏళ్లుగా, రాంబిల్లి మండలంలోని పీహెచ్సీలలో లేబ్ టెక్నీషియన్లు 22 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ రెగ్యులర్ కాలేదని బదిలీకి చాన్స్ ఇవ్వలేదని, కనీసం ఇప్పుడైనా ప్రత్యేకంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఉద్యోగంలో చేరిన స్ధానంలోనే పదవీ విరమణ చేయాల్సి వస్తుందన్నారు.
ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల కష్టాలు
కాంట్రాక్టు ఉద్యోగులుగా ఇన్నాళ్లూ
బదిలీకి అవకాశం లేదు
ఏడాది క్రితం రెగ్యులరైజ్ చేసిన
వైఎస్సార్సీపీ ప్రభుత్వం
ఈసారైనా బదిలీకి చాన్స్ ఇవ్వాలని
కోరుతున్న వైద్య సిబ్బంది
క్రమబద్ధీకరించి సంవత్సరమే అయిందని నిరాకరిస్తున్న ప్రస్తుత సర్కారు

20 ఏళ్లకు పైబడి ఒకేచోట..