
మనుగడ ప్రశ్నార్థకం
గోవాడ సుగర్స్
ఎమ్మెల్యే, ఎంపీ గార్లూ...
ప్రభుత్వ సాయం ఏదీ ?
ప్రభుత్వ సాయం అందించి గోవాడ ఫ్యాక్టరీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు, తర్వాత చెప్పిన ఎంపీ సీఎం రమేష్, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు సత్యనారాయణమూర్తి ఇప్పుడు ఫ్యాక్టరీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడంలేదు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తేలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఓవరాయిలింగ్ పనుల్లో అవసరమైన మిషనరీలో మార్పు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఫ్యాక్టరీకి ఎంపీ, ఎమ్మెల్యే ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి సాయంగా ఇప్పించలేకపోయారు. వీరి నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ఫ్యాక్టరీకి ఈ దయనీయ దుస్థితి పట్టింది. క్రషింగ్ నిలిచిన సందర్భంలో రైతులు అనేకసార్లు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేసినా ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి కనీస చర్యలు చేపట్టలేదు. ఫ్యాక్టరీని నష్టాల్లో చూపించి చివరికి మూసేయించాలన్న ఆలోచనలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చోడవరం: రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక సుగర్ ఫ్యాక్టరీ గోవాడ చక్కెర కర్మాగారం. మొత్తం 11 సుగర్ ఫ్యాక్టరీలు ఉండగా ఇప్పటికే 10 కర్మాగారాలను మూసివేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన గోవాడ సుగర్స్.. గత చంద్రబాబు పాలనా కాలంలో కునారిల్లింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మళ్లీ ఈ కర్మాగారానికి ఆర్థిక సాయం చేసి కొత్త ఊపిరులు ఊదారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీరుతో ఈ సుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ ఫ్యాక్టరీపై 23 వేల మంది చెరకు రైతులు, 2 వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ సాయంలేక ఒకపక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా.. మరోపక్క పాత మిషనరీ కావడంతో తరుచూ యాంత్రిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముగిసిన సీజన్లో పలుమార్లు క్రషింగ్కు అంతరాయం కలిగి చివరికి లక్ష్యం చేరుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.89 కోట్లను గ్రాంట్గా, వడ్డీ లేని రుణంగా ఎటువంటి షూరిటీ పెట్టుకోకుండా ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఒక్కపైసా కూడా ఫ్యాక్టరీకి గాని, రైతుల చెరకు బకాయిలకు గాని సాయం చేయలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిపోయింది.
ప్రభుత్వం ఆదుకుంటేనే..
2024–25 సీజన్కు సంబంధించిన చెరకు రైతుల బకాయిలు, కార్మికుల బకాయి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఫ్యాక్టరీ ఉంది. వచ్చే సీజన్ క్రషింగ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.35 కోట్ల సాయం చేయాల్సి ఉంది. లేకుంటే వచ్చే సీజన్ను ప్రారంభించే పరిస్థితి లేదు. అంతేకాకుండా పంచదార ఉత్పత్తితో పాటు ఉప ఉత్పత్తులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఇథనాయిల్, డిస్టి లరీ పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంది. గత వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కేంద్రం సహకారంతో రూ.102 కోట్లతో ఇథనాయిల్ పరిశ్రమ పెట్టడానికి కావలసిన అన్ని అనుమతులు తీసుకోవడం, కొంత నిధులు కూడా మంజూరుకు సిద్ధం చేయడం జరిగింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ ప్రాజెక్టును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోపక్క డిస్టిలరీ పరిశ్రమకు రూ.300 కోట్లు తెస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే ఇటీవల ప్రకటించినా ఆ ప్రాజెక్టు కూడా ప్రకటనలకే పరిమితమైంది. కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు, నిధులు ఇవ్వడంతోపాటు నిలిచిపోయిన కో జనరేషన్ ప్లాంట్ను కూడా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
సుమారు రూ.50 కోట్లు అత్యవసరంగా ప్రభుత్వం విడుదల చేస్తే.. వచ్చే సీజన్ క్రషింగ్తోపాటు ఓవరాయిలింగ్ పనులు కూడా జరిగి ఫ్యాక్టరీ గాడిలో పడే అవకాశం ఉంది. ఎన్నికల ముందు చెరకు రైతులను, సుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇటువైపే చూడకపోవడంపై రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో
కొట్టుమిట్టాడుతున్న ఫ్యాక్టరీ
ఏడాదిలో ఒక్క పైసా కూడా
అందని ప్రభుత్వ సాయం
వైఎస్సార్సీపీ హయాంలో
ఫ్యాక్టరీకి రూ.89 కోట్ల సాయం
గోవాడ సహకార చక్కెర కర్మాగారం భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. వచ్చే క్రషింగ్ సీజన్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు చుట్టుముడుతున్నాయి. అత్యధిక షేర్ కలిగిన ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆదుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఫ్యాక్టరీ నడుస్తుందా.. మూసేస్తారా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.