
ఈనెల కూడా పప్పన్నం లేనట్టే!
అనకాపల్లి టౌన్: కందిపప్పు.. బలవర్ధకమైన ఆహార పదార్థం. చక్కగా ప్రొటీన్ అందిస్తుంది. అందుకే ధర ఎంతైనా కందిపప్పును కొంటారు. చౌకధరల దుకాణంలో కూడా దీనికే డిమాండ్ ఎక్కువ. అయితే గత ఐదు నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు, రాగులు, గోధుమ పిండి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాగులు, గోధుమల సంగతి పక్కన పెడితే కనీసం కందిపప్పును సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నెల కూడా కందిపప్పును అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 7652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి నిలిచిపోయాయి. కొన్ని నెలలు అరకొరగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఐదు నెలలుగా పూర్తిగా నిలిపివేసింది. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్షాపుల్లో కందిపప్పు పూర్తిగా కనబడదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర కేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి 130 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. కూటమి నేతలు అధికారంలోకి రాకముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్ధాయిలో ఒక్క నెల కూడా పూర్తి స్ధాయిలో సరుకులు సరఫరా చేయకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఐదు నెలలుగా కందిపప్పు అందించని కూటమి ప్రభుత్వం
546 మెట్రిక్ టన్నుల సరఫరాకు
ఎగనామం
నాణ్యత కలిగిన బియ్యం ఇవ్వాలి
పేదలకు ఇచ్చే కందిపప్పును ప్రభుత్వం ఐదు నెలలుగా నిలిపివేయడం దారుణం. అలాగే నాణ్యత కలిగిన బియ్యం ఇస్తే బహిరంగ మార్కెట్లో కొనాల్సిన అవసరం ఉండదు.
–కొణతాల హరనాథ్బాబు, ఆమ్ ఆద్మీ జిల్లా కన్వీనర్
పేదవాడు ప్రొటీన్ ఫుడ్కు దూరం
ప్రత్యేక కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరకు కందిపప్పు పంపిణీ చేయాలి. పేదవాడికి కందిపప్పే పరమాన్నం. దీనిని సరఫరా చేయలేకపోవడం వలన పేదలు ప్రొటీన్ ఫుడ్కు దూరం అయినట్లే.
–కోన లక్ష్మణ్, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు

ఈనెల కూడా పప్పన్నం లేనట్టే!

ఈనెల కూడా పప్పన్నం లేనట్టే!