
మంత్రుల కమిటీ సంగతేంటి?
● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలు ● ఆలయ ఇన్చార్జి ఈవోతో సహా ఆరుగురు అధికారుల సస్పెన్షన్ ● కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ● మంత్రుల కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా చర్యల్లేవు.. ● నిజాలను గోడ వెనకే సమాధి చేసేసిన త్రిసభ్య కమిషన్
మంత్రుల కమిటీ సమయంలోనే
గోడ నిర్మాణం..!
కాంట్రాక్టరు చెప్పినదాని ప్రకారం చందనోత్సవానికి ఆరు రోజుల ముందే గోడ నిర్మాణం పూర్తయింది. ఏప్రిల్ 16న నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే రోజున మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం.. దేవస్థానం అధికారులతో కొండపైనే సమావేశమై సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే గోడ నిర్మాణం గురించి మంత్రుల కమిటీ సమీక్షలో ప్రస్తావన వచ్చే ఉంటుంది. కానీ.. దాన్ని బయటికి రానివ్వకుండా అటు త్రిసభ్య కమిషన్.. ఇటు ప్రభుత్వం కప్పిపుచ్చింది. ఈ గోడ నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా కమిటీ ఏర్పాట్లు పరిశీలనకు పలుమార్లు కొండపై హడావుడి చేసింది. కానీ గోడ నిర్మాణం ఎలా జరుగుతోంది.? నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అనేది పరిశీలించలేదు. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రుల కమిటీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వానికి, త్రిసభ్య కమిషన్కు ఏమాత్రం కనిపించకపోవడం గమనార్హం. మొత్తంగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. విషాద ఘటనలో ప్రభుత్వం తమకు, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కేవలం అధికారులు, ఉద్యోగులపైనే చర్యలు తీసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా తాత్కాలికంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కే.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏఈ పి.మదన్మోహన్ల సస్పెన్షన్కు ఆదేశించింది. అదేవిధంగా గోడ నిర్మించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసమంటూ ఏర్పాటు చేసిన కమిటీలో ఉంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు మంత్రులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తప్పంతా అధికారులు, దిగువస్థాయి సిబ్బందిదే అన్నట్లుగా వారిపైనే వేటు వేసింది. దాసుని తప్పు దండనతోనే సరి అన్నట్లుగా.. పనుల పర్యవేక్షణ అంటూ ప్రచార ఆర్భాటానికి పరిమితమై.. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడిన మంత్రుల కమిటీ మీద మాత్రం ఈగ వాలనీయకుండా జాగ్రత్తపడింది.
మంత్రులూ ఘటనకు బాధ్యులేగా..?
మూడు రోజుల పాటు విచారణ అంటూ హడావుడి చేసిన త్రిసభ్య కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గోడ ఎవరు కట్టారు?.. ఎందుకు కట్టారు.? దాని వెనక ఎవరు ఉన్నారు.. నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా అనే కోణాల్లో కేవలం అధికారులకు సంబంధించే విచారణ చేపట్టారే తప్ప.. మంత్రుల కోణం నుంచి కించిత్తు దర్యాప్తు చెయ్యలేదు. వాస్తవానికి చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏప్రిల్ 7వ తేదీన నలుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్తో పాటు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారులున్నారు. కమిటీ నియమించిన తర్వాత నుంచి మంత్రుల బృందం కొండపైనే నిరంతర పర్యటన, సమీక్షలంటూ హడావుడి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించలేదు.