
పరిహారం కూడా దేవస్థానం సొమ్మే..!
● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం, ఒకరికి గాయాలు ● మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు వంతున ప్రకటించిన ప్రభుత్వం ● ఇప్పుడు దేవస్థానం ఖజానా నుంచే బాధితులకు చెల్లింపులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
కూటమి ప్రభుత్వం మరోసారి తన బుద్ధి చూపించుకుంది. సింహాచలంలో జరిగిన విషాదానికి గల పరిహారాన్ని దేవస్థానంపై రుద్దేసింది. కొండపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు దేవస్థానం ఖజానా నుంచే రూ.1.78 కోట్లు చెల్లింపులు చేసింది. చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాగా, ఒకరికి గాయపడిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు పరిహారంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు కూడా హామీలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు దేవాలయం నిధులు కేటాయించడం పట్ల ఆలయ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దేవస్థానం ఖజానా నుంచే చెల్లింపులు
చందనోత్సవం నిర్వహణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వామపక్ష, ఇతర ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబాల కు అందించాలని సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా దేవస్థానం నిధుల నుంచే బాధితులకు చెల్లింపులు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో దేవస్థానం అధికారులు ఆగమేఘాల మీద బాధితుల కు చెక్కులు పంపిణీ చేసినట్లు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున రూ.1.75 కోట్లు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు చెల్లించారు.
దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు
వాస్తవానికి ఘటన జరిగిన రోజున మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వమే నేరుగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఖజానా నుంచి పరిహారం అందిస్తుందని అందరూ భావించారు. అయితే దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధుల నుంచి పరిహారం కింద బాధిత కుటుంబాలకు అందజేసింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేందుకు భక్తులు దేవాలయానికి సమర్పించిన కానుకల నుంచి ఇవ్వడాన్ని ఆలయ వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. దేవాలయం అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఇలా పరిహారాల రూపంలో ఇచ్చుకుంటూ పోతే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ తీరుపై విమర్శలు
సింహాచలం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పరిహారం చెల్లింపులపై వామపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అసమర్థ పాలన కారణంగా జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు దేవస్థానం ఖజానా నుంచే పరిహారం అందించి ప్రభుత్వం తప్పించుకోడాన్ని తప్పుబడుతున్నాయి. ఇవి ప్రభుత్వ హత్యలే అని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చందనోత్సవ నిర్వహణపై ఐదుగురు మంత్రుల కమిటీ నెల రోజుల పాటు విశాఖలోనే తిష్ట వేసి ఏర్పాట్లు చేసిన వేడుకల్లో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మంత్రులను కూడా బాధ్యులను చేయాలని పట్టుబడుతున్నారు.
దేవదాయ శాఖ నుంచి వచ్చాయి
దేవదాయ శాఖ నుంచి పరిహారం కింద నిధులు కలెక్టర్ నిధికి వచ్చాయి. వాటిని మాత్రమే బాధిత కుటుంబాలకు చెల్లించాం.
– ఎం.ఎన్.హరేందిరప్రసాద్, జిల్లా కలెక్టర్