
లేటరైట్ తవ్వకాలు నిలిపివేయాలి
● గిరిజనుల హక్కులకు విఘాతం
● స్పీకర్ కల్పించుకోవాలి
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం డిమాండ్
నాతవరం: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జరుగుతున్న అక్రమ లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. అసనగిరి పంచాయతీ శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను సోమవారం సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను యుద్ధప్రాతిపదికన నిలుపుదల చేయకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ ప్రాంతం 1/70 యాక్టు పరిధిలో ఉందని, లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను ఉల్లంఘించి చేస్తున్న ఈ తవ్వకాల కారణంగా అడవి బిడ్డల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. గతంలో లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు. ఇదే కొనసాగితే ఈ ప్రాంత గిరిజనులు జీవనం సాగిస్తున్న అటవీ సంపదతో పాటు జీడిమామిడి తోటలు నాశనం అవుతాయన్నారు. లేటరైట్ తవ్వకాలు ఆపకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు, పార్టీ సీనియర్ నాయకుడు త్రిమూర్తులురెడ్డి, రాజవొమ్మంగి మండల పార్టీ కార్యదర్శి సూరిబాబు, ప్రజా నాణ్యమండలి నాయకుడు రమేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.