
శెట్టిపాలెంలో కాఫీ పొడి తయారీ కేంద్రం
● స్థలాన్ని పరిశీలించిన
గిరిజన కార్పొరేషన్ ఎండీ కల్పనాకుమారి
మాకవరపాలెం: మండలంలోని శెట్టిపాలెంలో కాఫీపొడి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గిరిజన కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న ఈ కేంద్రం కోసం గ్రామంలోని సర్వే నంబర్లు 108, 109లలో ఉన్న 12 ఎకరాల డి–పట్టాభూములను ఎంపిక చేశారు. ఈ భూములను గిరిజన కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. మ్యాప్, రికార్డులను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, ఆదేశాలు రాగానే నిర్మాణం చేపడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, ఇన్చార్జ్ తహసీల్దార్ రామారావు, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.