
ముందస్తు సాగుకు సిద్ధమేనా?
సాక్షి, అనకాపల్లి: నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో మే నెలలోనే వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్కు ఈ వర్షాలు శుభ సూచనలే అయినా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో జిల్లాలో వరి ఎక్కువగా సాగు చేస్తారు. సకాలంలో వరుణుడు కరుణిస్తే ఏటా జూన్ ఆరంభం నుంచే దుక్కులు చేపట్టి భూములను సిద్ధం చేసుకుంటారు. ఒకవైపు వర్షాలు ఊరిస్తున్నా.. రైతులు సాగుకు ముందుకు సాగలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడం.. కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటన్న సందిగ్ధం వారిని డైలమాలో పడేశాయి. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అప్పు చేసుకుని ముందడుగు వేస్తే గతేడాదిలాగే నష్టపోయే పరిస్థితి నెలకొంటుందా..? అనే అనుమానంతో రైతన్న దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాడు. ‘అన్నదాత సుఖీభవ’ సాయాన్ని గతేడాదిలా ఈసారి కూడా ఎగ్గొడతారన్న భయం వారిని వెంటాడుతోంది.
జూన్ 15 నుంచి అనువైన సమయం
ఖరీఫ్లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి చాలా మండలాల్లో ముందస్తుగా భారీ వర్షాలు కురిశాయి. ఇంకా వర్షసూచన ఉందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం 1.50 లక్షల ఎకరాలు కాగా..వీటిలో 1.30 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ఇప్పటికే 24,112 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 23,109 వరి విత్తనాలు, 893 పచ్చి రొట్ట విత్తనాలు, 111 అపరాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విత్తనాలు అగ్రిల్యాబ్కు విత్తన శుద్ధికి పంపించినట్లు జేడీ వెల్లడించారు. వర్షాన్ని రైతులు వినియోగించుకుని భూమిని దున్ని, ఖరీఫ్ పైరులైన సజ్జ, కొర్ర, అపరాలు, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు చెప్పారు.
‘నైరుతి’ ప్రభావంతో తొందరగా వచ్చిన వర్షాలు
ఇంకా దుక్కులు చేపట్టని రైతులు
మరోవైపు పెట్టుబడి సాయం
అందలేదనే బెంగ
ముందస్తు వర్షాలతో చెరకుకు లాభం
ప్రస్తుతం పడుతున్న ముందస్తు నైరుతి ప్రభావ వర్షాలు చెరకు పంటకు మంచిది. కానీ వరి సాగుకు అనువైనది కాదు. ఇప్పటికే దుక్కులు దున్నుకుని ఉంటే వరి సాగుకు మేలు జరిగేది. అయితే రైతు ఇంకా సన్నద్ధమవ్వలేదు. జిల్లాలో 10 శాతం కూడా దుక్కులు అవ్వలేదు. ఇప్పటివరకూ వరి నాట్లయితే ఎవరూ వేయలేదు. జూలై 15 తరువాతే ఖరీఫ్ సీజన్కు రైతులు వరినాట్లు వేస్తారు. గతేడాది ఖరీఫ్ సాగులో వరి పంట ఆలస్యంగా వేశారు. వర్షాలు తగ్గితే రైతులు దుక్కులు దున్నుకుంటే మంచింది. నేలలో వర్షపు నీరు ఇంకి వరి సాగుకు మేలు జరుగుతుంది.
– జగన్నాథరావు,
ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త
సాయం లేకపోతే వ్యవసాయం చేయలేం..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయ రంగం కుదేలవుతుంది. 2004కు ముందు చంద్రబాబు పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నకు రాజన్న అండగా నిలిచారు. 2019–24లో ఆర్బీకేల ద్వారా జగనన్న విస్తృత సేవలందించి రైతు బాంధవుడిగా పేరుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. ఈసారి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకపోతే రైతు వ్యవసాయం చేయడం మానేస్తాడు.
– పోతల సత్తిబాబు, రైతు, ఆక్సాపేట గ్రామం, కోటవురట్ల మండలం

ముందస్తు సాగుకు సిద్ధమేనా?

ముందస్తు సాగుకు సిద్ధమేనా?