
యోగాతో ఆరోగ్యం, ఆనందం
ముత్యాలమ్మపాలెం తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అభ్యాసకులు
పరవాడ: సాగరతీరంలో ఆనంద‘యోగ’ం.. అభ్యాసకుల ఆసనాలతో ముచ్చటైన దృశ్యం.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ముత్యాలమ్మపాలెం తీరంలో మంగళవారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజులపాటు నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని, యోగాను ప్రతి ఒక్కరు దినచర్యగా చేసుకోవాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో 25 మంది యోగా గురువులు, 100 మంది మాస్టర్ ట్రైనీలతో 4,500 మంది సచివాలయ సిబ్బందికి యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పొందిన సచివాలయ సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి, రోజుకు 50 మందికి చొప్పున ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకో యోగాసనం వేసేలా శిక్షణ ఇస్తారన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.మనోరమ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అనిత, మండల ప్రత్యేకాధికారి సరోజిని, సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీడీవో బి.రమేష్నాయుడు, తహసీల్దార్ ఎస్వీ అంబేడ్కర్, తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్యం, ఆనందం