
కారు ఢీకొని జింకకు గాయాలు
కొమ్మాది (విశాఖ): బీచ్రోడ్డులో ఇందిరాగాంధీ జూపార్కు సమీపంలో నగరం నుంచి భీమిలి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న జింకను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఓ యువకుడు గమనించి, గాయపడిన జింకను రోడ్డు పక్కకు చేర్చి నీరు తాగించాడు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. అయితే, ఇటీవల కాలంలో జింకలు తరచూ జనావాసాల్లోకి రావడం, ప్రమాదాలకు గురికావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రమాదాల బారిన పడి మరికొన్ని జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.