
అడవులను తాకట్టు పెట్టొద్దు...
దేవరాపల్లి : చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్యలో అదాని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీలో బుధవారం పర్యటించిన ఆయన సమ్మెదలో స్థానిక గిరిజనులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అడవి బాట పట్టడం అంటే అడవులను తాకట్టు పెట్టడం కాదని విమర్శించారు. గిరిజనుల బతుకులు నాశనం చేసేందుకు అడవి బాట పట్టినట్టు అర్ధమవుతుందని ఆరోపించారు. చింతలపూడి పంచాయతీలో శారదానదిపై ప్రాజెక్టులు నిర్మించి తద్వారా పంపింగ్ చేసి విజయనగరం జిల్లా వేపాడ మండలం కరకవలస పంచాయతీ శివారు మారిక గ్రామంలో 30 సర్వే నెంబర్లలో 213 ఎకరాల భూమి సేకరించి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఈ నిర్ణయాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. గిరిజనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్టినా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రైవాడ ప్రాజెక్టు జీవనదిగా ఉన్న శారదానదిపై అదాని కన్ను పడిందని ధ్వజమెత్తారు. రైవాడ ప్రాజెక్టు అదాని చేతుల్లోకి వెళ్లిపోవడంతో పాటు ఆయకట్టు భూములన్నీ బీడులుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయకట్టు రైతులు, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక గిరిజనులు రాజకీయాలకు అతీతంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
హైడ్రో పవర్ప్లాంట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
సీపీఎం నేత వెంకన్న