
గతేడాది మత్స్యకార భరోసా ఎగనామం
నక్కపల్లి : కూటమి ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేసిందని వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, పలువురు మత్స్యకార నాయకులు ఆరోపించారు. ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల పూర్తయిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు వేట నిషేధం అమలైందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా రూ.20 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి కేవలం ఒక ఏడాదికి సంబంధించిన పరిహారం మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా రూ.4వేలు చెల్లించేవారని, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచినట్టు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన వెంటనే మొదటి ఏడాది నుంచే వేట నిషేధ పరిహారం మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పుడు రెండేళ్ల పరిహారం చెల్లిస్తారని మత్స్యకారులంతా ఆశపడ్డారని, కూటమి ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 33 వేల మందికి మత్స్యకార భరోసా అందిందన్నారు. గత జగనన్న ప్రభుత్వం మత్స్యకారుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు రూ.24 కోట్లతో పాయకరావుపేట నియోజకవర్గానికి ఫిష్ ల్యాండింగ్ సెంటరు మంజూరు చేసిందన్నారు. రాజయ్యపేట వద్ద నిర్మించేందుకు స్థల పరిశీలన కూడా జరిగిందని వివరించారు. ఇది పూర్తయితే ఈ ప్రాంత మత్స్యకారులకు ఉపాధి తోపాటు, వలలు, ఇంజన్లు, మత్స్య సంపదను భద్రపరుచుకోవడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడేదన్నారు. ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటరును ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రైవేటు స్టీల్ప్లాంటు కోసం పోర్టు నిర్మించడానికి అనుమతులు మంజూరు చేయడం సిగ్గుచేటన్నారు. అధికారం చేపట్టి 11 నెలలు గడుస్తున్నా కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఎరిపల్లి ముసలయ్య, మత్స్యకార నాయకులు ఎరిపల్లి నాగేశు,నూకరాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు.
వేట నిషేధ భృతిపై మత్స్యకారుల అసంతృప్తి
అచ్యుతాపురం రూరల్ : వేట నిషేధ భృతిపై పూడిమడక మత్స్యకారులు అసంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా స్పోక్స్ పర్సన్, మత్స్యకార నాయకుడు ఉమ్మిడి జగన్ అన్నారు. మత్స్యకారులకు ఒక సంవత్సరానికి మాత్రమే వేట నిషేధ భృతి ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, గతేడాది భృతి కూడా ఇవ్వకుండా అన్యాయం ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్థానిక మత్స్యకారులతో కలిసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట నిషేధ భృతి రూ.20వేలు ఇస్తామని చెప్పారని, అలా గతేడాది, ఈఏడాది కలిసి రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేధ మత్స్యకారులు ప్రస్తుతం అప్పుల పాలైన దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
ఈ ఏడాది భరోసా మాత్రమే విడుదల
మత్స్యకారులకు కూటమి దగా
వైఎస్సార్సీపీ నేతల ధ్వజం

గతేడాది మత్స్యకార భరోసా ఎగనామం