అనకాపల్లి టౌన్: పట్ణణంలోని వి.వి. రమణ రైతు భారతి కేంద్రంలో జ్యోతి సరళ స్మారక కళాపరిషత్, డైమండ్ హిట్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటిక పోటీలు ఆదివారంతో ముగిసాయి. ఈ కార్యక్రమాన్ని బి.ఎం రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నాటికలు ఆహూతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆలోచింపజేసిన రేపటి శత్రువు..
ఈ కాలం పిల్లలు తన ఇల్లు, భార్య, తన సంతానం అని గిరి గీసుకుంటున్నారు. అందులో మరొకరికి స్ధానం లేదు. ఇది పెద్దవాళ్ళు అర్ధం చేసుకోవాలి. నష్టమయినా, కష్టమయినా ఈ జీవిత సత్యాన్ని జీర్ణం చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ జీవితం దుర్భరమైపోతుందని ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది.
యాంత్రిక యుగంలో..‘కొత్త సైన్యం’..
మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మానవ జీవితంలో వేగం పెరిగిపోయింది. ఈ వేగంలో మానవ సంబంధాలు బలహీనమై పోయాయి. పిల్లలు పట్టించుకోవడం లేదని వాళ్ళని ఆడిపోసుకోవడం అనవసరం. ఇది యాంత్రిక యుగం. అంటే మనిషి యంత్రంలా జీవిస్తాడనే అర్ధం. ఈ కాలానికి తగట్లు మనమే మారాలి. మన శేష జీవితాన్ని దేశానికి అంకితం చేయాలి... అని నిర్ణయిచుకున్న పెద్దలు ఈ నాటికలో కనిపిస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, బొడ్డేడ జగత్రావు, కర్రి దివాకర్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.