రెగ్యులర్
తుమ్మపాల: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని, పదో తరగతి పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు పి. శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పట్టణంలో పలు పరీక్ష కేంద్రాలను ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావునాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనుకూలంగా బెంచీలు ఉండాలని, ఫ్యాన్లు తిరిగేలా చూడాలని, సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకుముందు ఆయన పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ, స్క్వాడ్ బృందాల అధికారులతో మాట్లాడుతూ ఎక్కడ ఏ లోపాలున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 107 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో ఏడు సెంటర్లలో ఎస్ఎస్సీ బోర్డు విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తారన్నారు. 22 వేల 42 మంది రెగ్యులర్, 1258 ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. అలాగే 667 మంది ఓపెన్ స్కూల్ అభ్యర్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీక్షల కోసం ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, అవసరం మేరకు ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఏడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించమన్నారు. జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారని వివరించారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, సర్వీసులు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సహకారంతో ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విద్యార్థులంతా ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్వో వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు కృష్ణంరాజు, జనార్ధన్ పాల్గొన్నారు.
హాజరుకానున్న విద్యార్థులు
పరీక్షలు ఎప్పటివరకంటే : సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ
జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలు
ఏడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు
ఏర్పాట్లు పరిశీలించిన విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు శ్రీనివాసరావు
విజయోస్తు..