తుమ్మపాల : అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామమని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు గాంధేయ మార్గంలో నిరాహారదీక్ష చేసి ఆశయసాధన కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలి అమరజీవిగా నిలిచారని తెలిపారు. ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.