సాక్షి, అనకాపల్లి: కొనుగోలు చేసే ప్రజలందరికీ వినియోగదారుల రక్షణ చట్టం చుట్టంలా అండగా నిలుస్తుందని కన్జూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టం (సీపీఏ) కారణంగా లక్షలాది మంది వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్లో మార్పు, ఈ కామర్స్ అభివృద్ధి, టెలీ మార్కెటింగ్, డైరెక్ట్ సేల్స్, ఆన్లైన్ ట్రేడింగ్, తప్పుదారి పట్టించే ప్రకటనలు, కల్తీ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలు పెరిగిన నేపథ్యంలో 107 సెక్షన్లతో కొత్త వినియోగదారుల రక్షణ చట్టం–2020లో అమల్లోకి వచ్చిందన్నారు. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకుంటేనే కేసు గెలిచేందుకు వీలుగా ఉంటుందని, అలాగే గ్యారంటీ లేదా వారంటీ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
చట్టపరిధిలోకి వచ్చేవి ఇవే..
బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు, విత్తనాల కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు, పురుగుల మందుల కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు, ఎయిర్లైన్స్, క్లినికల్ లేబొరేటరీలు, ట్రాన్స్పోర్టు కొరియర్ సర్వీసు, జీవిత బీమా, రైల్వే, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, లే–అవుట్లు, గ్యాస్, లాయర్లు, అపార్ట్మెంట్లు, టూరిస్టు సర్వీసు, ఈ–కామర్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ, హౌసింగ్ బోర్డు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ఇంటర్మీడియట్ బోర్డు వినియోగదారుని చట్టపరిధిలోకి వస్తాయి.