యలమంచిలి రూరల్ : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు జి.దేవి గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి విద్యార్థులకు, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆయా పాఠశాలల పరిసరాలు, వండిన ఆహార పదార్థాల నాణ్యత, నిర్దేశిత కొలతల్లో ఆహార పదార్థాలు వండి పెడుతున్నారో లేదో పరిశీలించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు పాఠశాలలో వండిన అన్నం ముద్దగా ఉండడం, కొంతమంది విద్యార్థులకు అన్నం చాలకపోవడంతో ఆమె వంట ఏజెన్సీ నిర్వాహకులు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం ఎందుకు ముద్ద అయిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏజెన్సీ నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఇలా అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార నాణ్యత ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో అరుణ్ కుమార్, రెవెన్యూ,విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ రోడ్డు జెడ్పీ పాఠశాలలో
ఆహార కమిషన్ సభ్యురాలి తనిఖీలు
నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం
కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక