తుమ్మపాల: జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాల యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఈ నెల 15న మూడో శనివారం నిర్వహించే శుభ్రత కార్యక్రమాలపై గురువారం కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభు త్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు వంటి ప్రదేశాలలో పరిసరాల పరిశుభ్రత చేపట్టాలన్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది బహిరంగ ప్రదేశా ల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని, అందులో ప్రజలను, విద్యార్థులను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, మూడో శనివారం ప్రభుత్వం నిర్దేశించిన థీంతో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడం జరిగిందని, దాని అమ్మకాలు, కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వినియోగదారులు రీయూజ్ కవర్లు, సంచులు వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మొక్కలు నాటాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు ఏర్పాటు చేయాలని, పరిసరాలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సుందరీకరణలో భాగంగా వంతెనలు, భవనాలపై సృజనాత్మక పెయింటిగులు వేయించాలని తెలిపారు.
స్వచ్ఛ అవార్డులు...
మంచి పనితీరు కనబరిచిన స్వచ్ఛ వార్డు, స్వచ్ఛపాఠశాల, స్వచ్ఛ అపార్ట్మెంట్, స్వచ్ఛ కళాశాల, స్వచ్ఛ బస్టాండ్, రైల్వే స్టేషన్లను గుర్తించి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యకమానికి సంబంధించి ప్రతి జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా గణాంకాధికారి జి.రామారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె. శచీదేవి, జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఇ.నాగలక్ష్మి, జిల్లా ప్రజా రవాణా అధికారి కె.పద్మావతి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి, డ్వామా పీడీ బి.పూర్ణమాదేవి పాల్గొన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
కలెక్టర్ విజయ కృష్ణన్