అచ్యుతాపురం రూరల్ : మత్స్యకార గ్రామమైన పూడిమడక గంటాలమ్మ వైన్ షాపులో బుధవారం అర్థరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో రూ.2 లక్షల 70 వేలు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాపులో ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలిసిన వ్యక్తే దీనికి పాల్పడి ఉంటాడని అంచనా వేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయో గమనించి మొదట వాటిపై దృష్టి సారించి, ఆపై దర్జాగా దొంగతనం చేశాడు. పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా అన్వేషించినప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకపోయిందన్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి చేతికి గ్లౌజ్లు, ముఖానికి మంకీ క్యాప్, కాలికి షూస్ వేసుకుని ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త వహించాడు. క్యాష్ కౌంటర్కు తాళాలు, భద్రత లేకుండా అంత మొత్తం ఉంచడంపై పోలీసులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో వైన్ షాపులు సిండికేట్లుగా ఏర్పడి వ్యాపారాలు చేసినప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగాయని ప్రజలు గుర్తు చేసుకున్నారు. స్థానిక సీఐ నమ్మి గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
పూడిమడక వైన్ షాప్లో చోరీ