నక్కపల్లి : వార్షిక కల్యాణం అనంతరం ఉభయ నాంచారులతో కూడిన వైకుంఠనాథుని వన విహార యాత్ర (తోట ఉత్సవం) గురువారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని భక్తులు స్వామివారి హనీమూన్గా చెప్పుకుంటుంటారు. ప్రతి ఏటా వార్షిక కల్యాణం అనంతరం స్వామివారి తోట ఉత్సవం నిర్వహిస్తారు. ఉపమాక శివారు సారిపల్లిపాలెం సమీపంలో గల తోటలో ఉన్న మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు జి.వరప్రసాద్ ఘనంగా నిర్వహించారు. రాజాధిరాజ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వర స్వామిని కొలువుదీర్చి మండపం వద్దకు తీసుకొచ్చారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మండపశుద్ధి, ప్రసాద నివేదన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాల ఆరాధనలో భాగంగా ఆలయంలో విశేష హోమాలు జరిగాయి. వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణం అనంతరం నాలుగవ రోజున ఈ వన విహార యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రాత్రి స్వామివారి తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి వనవిహార యాత్ర (తోట ఉత్సవాన్ని) తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు తరలివచ్చారు. ఉత్సవానికి వెళ్తున్న స్వామి వెంట వందలాది మంది భక్తులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, ఆలయ అర్చకులు సంకర్షణపల్లి కష్ణమాచార్యులు, శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, గోపాలాచార్యులు, నరసింహాచార్యులు పాల్గొన్నారు.
ఘనంగా సదస్యం..
కల్యాణోత్సవాల్లో బాగంగా సదస్యం (పండిత సభ) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ వేదిక వద్ద స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గాయత్రీదేవి స్వామివారి కల్యాణం నిర్వహించడం ద్వారా లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు. పండితులంతా పురాణాలను ఔపోసన పట్టి స్వామివారికి నిర్వహించే కార్యక్రమాలను, కై ంకర్యాలను సేవల గురించి మనకు తెలియజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవాల్లో స్వామివారి సేవల్లో తరించిన పలువురు పండితులను సత్కరించారు. అనంతరం పుణ్యకోటి వాహనంపై ఉభయ నాంచారులతో కూడిన స్వామి వారిని కొలువుదీర్చి తిరువీధి సేవ నిర్వహించారు.
అలరిస్తున్న కోలాటాలు..
వెంకన్న కల్యాణోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలు కోలాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గురువారం తుని పట్టణానికి చెందిన కోలాట బృందం చేసిన కార్యక్రమం భక్తులను అలరించింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చిన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీటీడీ వారి ఆధ్వర్యంలో కూడా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఉభయనాంచారులతో కోనేటి రాయుడి విహారం
వందలాదిగా తరలి వచ్చిన భక్తులు