గొలుగొండ : మైదాన ప్రాంతంలో కూడా గిరిజనులకు డోలిమోత తప్పడం లేదు. కొత్త ఎల్లవరం గ్రామ పంచాయతీ శివారు డొంకాడ గిరిజన గ్రామంలో మువ్వల మేరీని ప్రసవం సమయంలో కుటుంబ సభ్యులు గ్రామం నుంచి ఆరిల్లోవ ప్రధాన రోడ్డుకు నాలుగు కిలోమీటర్ల దూరం డోలిమోతతో తీసుకు రావాల్సి వచ్చింది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేరీని ప్రధానరోడ్డుకు తీసుకువచ్చి గొలుగొండ ిపీహెచ్సీలో చేర్చగా, అక్కడ మగబిడ్డకు జన్మనివ్వడం జరిగిందని ఆ గ్రామస్తులు తెలిపారు. రోడ్డు లేకపోవడం వల్ల నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు వచ్చి రోడ్డు వేస్తామని చెప్పి నేటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారం రోజుల క్రితం రోడ్డు వేయాలని గ్రామం నుంచి ఆరిల్లోవ అటవీరోడ్డు వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, పండిన పంటను రోడ్డులేక బయటకు తీసుకువచ్చే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రోడ్డు వేయాలని కోరుతున్నారు.