తుమ్మపాల: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అదనపు ఆర్థిక సహాయం వినియోగించుకుని ఇంటి నిర్మాణాలను సత్వరం పూర్తి చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎస్సీ, బీసీ, ఎస్టీ, పీవీటీజీ లబ్ధిదారులకు గృహాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న గృహాలకు అదనపు ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ఆమె వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా 2029 నాటికి ’అందరికీ ఇళ్లు’ నిర్మించాలనే లక్ష్యంతో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రస్తుత యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.1 లక్ష చొప్పున అదనపు మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 17,749 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 13,548 మంది లబ్ధిదారులకు రూ. 70.04 కోట్లు అదనపు ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. మే నెలాఖరు నాటికి 13,687 గృహాలు పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న ఈ అదనపు ఆర్థిక లబ్ధి సదవకాశాన్ని వినియోగించుకుని సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఆమె కోరారు.