● రాజాం మాజీ సర్పంచ్ మృతికి సంతాపం
● అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
బుచ్చెయ్యపేట : మండలంలోని రాజాం గ్రామ మాజీ సర్పంచ్ నాగులాపల్లి సత్యనారాయణ(67) అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. విప్లకారుడిగా, రైతు కూలీ సంఘం నాయకుడిగా పలు ఉద్యమాలు చేసిన ఆయన ప్రజల మనిషిగా పేరొందారు. ఆయన మృతికి పలు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలుపుతూ సత్యనారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సత్యనారాయణ తండ్రి నారాయణ రాజమండ్రి పేపరు మిల్లులో పని చేస్తూ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేసేవారు. అక్కడ నుంచి చోడవరం అంకుపాలెం వచ్చి తరువాత బుచ్చెయ్యపేట మండలం రాజాం వచ్చి స్థిరపడ్డారు. తల్లిదండ్రులు నారాయణ, వెంకయమ్మ ఇద్దరూ ఉద్యమాల్లో పాల్గొనడంతో సత్యనారాయణ కూడా ఆ బాట పట్టారు. 40 ఏళ్ల పాటు ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ ఓ దళానికి కమాండర్గా కూడా వ్యవహరించారు. ఉద్యమకారిణి మేధాపాట్కర్తో కలిసి పలు ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఐదేళ్ల పాటు విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు. తరువాత ప్రభుత్వం వద్ద లొంగిపోవడంతో ఆయనకు అనకాపల్లి జిల్లా కూండ్రం వద్ద ఐదెకరాలు ప్రభుత్వ భూమిని ఉచితంగా అందించారు. 1997లో మార్చిలో వడ్డాదిలో వ్యవసాయ కూలీ సంఘాన్ని స్ధాపించి జిల్లాలో వేలాది ఎకరాల సీలింగ్, బంజరు, పోరంబోకు భూములను పేద ప్రజలకు పంచేలా చేశారు. 2014లో సర్పంచ్గా ఎన్నికై రాజాం గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. రాజాంలో ఆయన మృతదేహానికి అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, సీఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు కనకరావు, రాష్ట్ర రైతు కూలీ సంఘం క్యాదర్శి దంతులూరి వర్మ, జిల్లా కార్యదర్శి కోన మోహనరావు, కార్మిక సంఘ నాయకుడు ఐయితరెడ్డి అప్పలనాయుడు, తదితరులు ఈ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతు బాంధవుడు ‘నాగులాపల్లి’ ఇక లేరు
రైతు బాంధవుడు ‘నాగులాపల్లి’ ఇక లేరు