మాడుగుల రూరల్ : మండలంలో గిరిజన గ్రామాలకు పోవు రహదారులు నిర్మించి, గొర్రిగెడ్డ మీద వంతెనలు నిర్మించాలని కోరుతూ ఏడు గ్రామాలకు చెందిన గిరిజనులు బుధవారం మోకాళ్ల మీద నిల్చొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. శంకరం గ్రామ పంచాయతీ శివారు గిరిజన గ్రామాలు అయిన తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, కొత్తవలస, మరియు తాడివలస వద్ద ఉరకగెడ్డల మీద వంతెనలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు, మోకాళ్ల మీద నిలబడి చంద్రబాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, పవన్కల్యాణ్బాబు మా గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి ఇ.నర్సింహమూర్తి, కె. భవానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రూ 9 కోట్ల 30 లక్షల వ్యయంతో రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తామని నమ్మబలికి ఎన్నికలై 9 మాసాలు పూర్తి అవుతున్నా సరే కనీసం పట్టించుకోలేదన్నారు. గొటివాడ నుంచి కొత్తవలస, వెలగలపాడు, గొప్పూరు తాడివలస మీదుగా రాయిపాలెం, రాజంపేట మీదుగా కృష్ణంపాలెం తారురోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే వందలాది మంది గిరిజనులకు రవాణా సౌకర్యం కల్పించవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్థానికుడు కాకపోవడం వల్ల ఇక్కడ గిరిజన ప్రజల సమస్యలు ఆయనకు తెలియవన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కూడా స్థానికుడు కాదని ఆయనకు కూడా స్థానిక సమస్యలు తెలియవని అన్నారు. వెంటనే గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సోమల నరసింహరావు, జన్ని చిన్నారావు, సోలం సన్యాసమ్మ, సోలం మంగ, గురువుల కృష్టమూర్తి, ఈశ్వరరావు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
● మోకాళ్ల పై నిల్చుని గిరిజనుల వినూత్న నిరసన
మా గ్రామాలకు రోడ్లేయండి మహాప్రభో!