ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమం

Mar 11 2025 12:52 AM | Updated on Mar 11 2025 12:50 AM

చెరకు రైతుల పక్షాన త్వరలో
రాజకీయాలు చేయడానికి రాలేదు

రైతుల ఆవేదన విన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించకపోతే చెరకు రైతుల తరపున త్వరలో ఉద్యమానికి దిగుతామని చెప్పారు. రాజకీయాలు చేయడానికి తాము ఇక్కడికి రాలేదని, చెరకు రైతుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలవాలనే వచ్చామని బొత్స చెప్పారు. చెరకు రైతులు రాష్ట్ర ప్రజలు కారా...వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. చెరకు రైతుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీకి తక్షణ సాయంగా రూ.35 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని త్వరలో జరగనున్న శానసమండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళుతుందని ఆయన చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ.89 కోట్లు సాయంగా ఇచ్చి ఫ్యాక్టరీని అప్పుల ఊబిలోంచి బయటకు తెచ్చిందని, రైతుల పక్షపాతిగా జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలుగా సాయం అందించారన్నారు.

ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వం పూర్తిగా చెరకు రైతులను, ఫ్యాక్టరీని విస్మరించిందని ధ్వజమెత్తారు. ఎంపీ ఎక్కడి నుంచో వచ్చారని, ఆయన ఈ ప్రాంతం వారు కాకపోవడంతో ఇక్కడ రైతులు, ఫ్యాక్టరీ సమస్యలు ఆయనకు పట్టవన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడి వారే కాబట్టి వారైనా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయకపోవడం విచారకరమన్నారు. రైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఉండదని, వారికి అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యూత్‌ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement