
నక్కపల్లి : చంద్రబాబుకు జైల్లో దోమల వల్ల ఎటువంటి ముప్పులేదని సీఎం పదవిపై విపరీతమైన వ్యామోహంతో ఉన్న కొడుకు లోకేష్ వల్లే ముప్పు ఉందని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు అన్నారు. ఆదివారం ఆయన పాయకరావుపేట విలేకర్లతో మాట్లాడుతూ దేశంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ.375 కోట్ల ప్రజాధనం లూటీ చేసి సిఐడీకి దొరికిపోవడం వల్లే జైలు పాలయ్యాడన్నారు. చంద్రబాబు అరెస్టుతో ముఖ్యమంత్రి జగన్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. నాలుగేళ్ల క్రితమే సీఐడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిందన్నారు. 140 మంది సాక్షులను విచారించిన తర్వాతే చంద్రబాబును అరెస్టు చేసారన్నారు. గతంలో గవర్నర్ పదవి ఇస్తానని మోసం చేయడం వల్లే మోత్కుపల్లి టీడీపీకి రాజీనామా చేశాడని అన్నారు. అప్పుడు చంద్రబాబును నీచుడు, మోసగాడు, వెన్నుపోటు దారుడు అని విమర్శించిన మోత్కుపల్లి ఇప్పుడు లోకేష్, భువనేశ్వరి ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, నిరాహార దీక్షలు చేస్తానని ప్రకటిస్తున్నాడని విమర్శించారు. వర్ల రామయ్యకు కూడా రాజ్యసభ ఇస్తానని మోసం చేశాడన్నారు. పార్టీ లేదు...అన్న అచ్చెన్నాయుడిని ఇంకా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో కనీస స్పందన లేదన్నారు. దమ్ముంటే చంద్రబాబు న్యాయపోరాటం చేసి నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
తండ్రి జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో
ఎంజాయ్ చేస్తున్నాడు
చంద్రబాబు మోసం చేసినా
మోత్కుపల్లికి సిగ్గురాలేదు
మాజీ ఎమ్మెల్యే చెంగల