
● బోటులో తిరుగుతూ షాపింగ్ ● ముడసర్లోవలో ఏర్పాటుకు అధ్యయనం ● శ్రీనగర్ టూర్లో పరిశీలించిన మేయర్ బృందం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ముడసర్లోవ రిజర్వాయర్లో బోటులో విహరిస్తూ కంబాలకొండ అందాలను తనివితీరా చూస్తూ కాఫీ తాగాలని ఉందా? అక్కడే నచ్చిన వాటిని కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా? అచ్చంగా శ్రీనగర్లోని దాల్ లేక్ తరహాలో... ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేందుకు...నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమాయత్తమవుతోంది. తాజాగా జీవీఎంసీ అధ్యయన యాత్రలో భాగంగా శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పర్యటనలో ‘దాల్ లేక్’ను పరిశీలించారు. పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచేందుకు వీలుగా దాల్ లేక్ను అభివృద్ధి చేశారు. బోటులో షికారు చేస్తూ... ఫ్యామిలీతో కలిసి అక్కడే భోజనం చేయడం, షాపింగ్ చేసేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు. అదేతరహాలో ఇక్కడ ముడసర్లోవను అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధికారులతో సమీక్షించారు. దీనిపై అధ్యయనం చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రధానంగా నగర వాసులతో పాటు విశాఖకు విచ్చేసే పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు.