జగనన్నకు చెబుదాం | - | Sakshi
Sakshi News home page

జగనన్నకు చెబుదాం

Sep 16 2023 1:54 AM | Updated on Sep 16 2023 1:54 AM

- - Sakshi

సమస్యల సత్వర పరిష్కారానికి

కోటవురట్ల: జిల్లా స్థాయి ‘జగన్నకు చెబుదాం (స్పందన)’ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని, సమస్యల సత్వర పరిష్కారానికి ఇది మరింతగా దోహదపడుతుందని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి అన్నారు. శుక్రవారం ఆయన కోటవురట్లలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి, ఆర్డీవో జయరాం, ఏఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా, డీఈవో వెంకటలక్ష్మమ్మ, డీఆర్‌డీఏ, ఐకేపీ అధికారులు, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. మొత్తం 159 వినతులు రాగా వాటిలో 110 రెవెన్యూ సమస్యలున్నాయి. ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, భూసర్వే సమస్యలపై అర్జీలు అందాయి. కోటవురట్ల, రాట్నాలపాలెం గ్రామాల మధ్య గెడ్డ ఆక్రమణకు గురైందని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. కోటవురట్లలో జగనన్నకాలనీలో 130 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని, ఈ కాలనీకి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయం లేదని విన్నవించారు. పందూరు, జల్లూరు గ్రామాల్లో వరాహనదిపై వంతెనలు కూలిపోయాయని, కొత్తవి నిర్మించాలని ఆయా గ్రామాల వారు కలెక్టర్‌ను వినతి పత్రం ఇచ్చారు.

ఎమ్మెల్యే బాబూరావు వినతి

కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టిని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కలిసి, పలు సమస్యల గురించి చర్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, జగనన్న కాలనీలో సమస్యలు, డ్రెయినేజీ సమస్యలు తన దృస్టికి వచ్చాయని, వీటిని పరిష్కరించాలని కోరారు. అర్హులైన వారు చాలామంది ఉన్నారని వారందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. వెలుగు పథకం ద్వారా డ్వాక్రా మహిళల కూరగాయల పెంపకం చేపట్టేందుకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

గోకులం షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 38 మంది గోకులం పథకం ద్వారా కంట్రిబ్యూషన్‌ చెల్లించి షెడ్లు నిర్మించుకున్నారని, వారందరికీ సుమారు రూ.30 లక్షలు విడుదల చేయాల్సి ఉందని రాజుపేట గ్రామ రైతులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. పలు గ్రామాల్లో ఇసుక గ్రావల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

జేజేఎం పనుల్లో జాప్యంపై ఫిర్యాదు

మా గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం మా గ్రామంలో ఇంటింటి కుళాయిల కోసం మూడేళ్ల క్రితం రూ.70 లక్షలు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు కుమ్మక్కయి పనులు చేయడం లేదు. పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

–జి.శ్రీనివాసరావు, ఉప సర్పంచ్‌, కె.వెంకటాపురం

దుగ్గాడ కాలువను ఆధునికీకరించాలి

దుగ్గాడ కాలువ ఆధునికీకరణ చేపట్టాలని జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేశాను. ఈ కాలువ కింద సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువను ఆధునికీకరించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

–పెట్ల రాంబాబు, బీకేపల్లి

కోటవురట్ల మండలంలో వినతులు స్వీకరించిన కలెక్టర్‌, జిల్లా అధికారులు

మొత్తం 159 అర్జీలు.. రెవెన్యూ అంశాలపైనే ఎక్కువ ఫిర్యాదులు

జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే పరిశీలన

స్పందన కార్యక్రమం ముగిశాక కలెక్టర్‌ తంగేడులో పాఠశాలను సందర్శించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేని పరిశీలించారు. మండలంలో తంగేడు నుంచి ఈనెల 16వ తేదీన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇంటింటికీ తిరిగి సర్వే చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ సదుపాయం కల్పించామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement