
టైల్స్తో వంటగది ప్లాట్ఫామ్
నర్సీపట్నం: అంతర్గత రహదారులు.. రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీలు.. టైల్స్తో మెరిసిపో తున్న ఫ్లోరింగ్.. ఇళ్లలో సకల సౌకర్యాలు.. టిడ్కో గృహాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇళ్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. మౌలిక వసతుల కల్పన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో జీ 3 టిడ్కో గృహాల నిర్మాణం జరిగింది. అక్టోబర్లో గృహాలు పంపిణీ చేయాల్సి ఉండడంతో మౌలిక వసతుల పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసే పనిలో టిడ్కో ఇంజినీరింగ్ విభాగం నిమగ్నమైంది.
జిల్లాలో నర్సీపట్నం టౌన్లో 1824, యలమంచిలి పట్టణంలో 2,160 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఆర్థిక స్థోమతను బట్టి వీటిని మూడు రకాలుగా విభజించారు. రెండు మున్సిపాలిటీల్లో 399 మంది లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల ఫ్లాట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. లబ్ధిదారులకు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 60 నుంచి 70 శాతం పూర్తయిందని మున్సిపల్ అధికారులు చెప్పారు.
రూ.23 కోట్లతో చకచకా పనులు
జీ 3 గృహాల వద్ద రూ.23 కోట్లతో రోడ్లు, అంతర్గత రహదారులు, సిమెంటు రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. డ్రెయిన్లు, ఓవర్హెడ్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల ముందు నిర్మాణంలో ఉన్న భవనాలను చూపించి జీ 3 గృహాలు ఇస్తున్నామని టీడీపీ నాయకులు ప్రజలను మోసగించారు. భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గృహాలు ఇచ్చేస్తున్నామంటూ లాటరీ తీశారు. టీడీపీ ప్రభుత్వంలో కాంక్రీట్ పనులు మాత్రమే చేయగా ప్రస్తుత వైఎస్సార్సీపీ సర్కార్ ఇళ్లలో టైల్స్, ప్లంబింగ్, ఫినిషింగ్ తదితర పనులు పూర్తి చేసింది.
అక్టోబర్ నెలాఖరుకు గృహాల పంపిణీ
జీ 3 గృహాలకు మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నెలాఖరునాటికి లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. లబ్ధిదారుల పేరున ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ 70 శాతం పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు గృహాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–కనకారావు, మున్సిపల్ కమిషనర్, నర్సీపట్నం
టిడ్కో గృహాల సముదాయంలో రూపుదిద్దుకుంటున్న అంతర్గత రహదారులు
