
నాటికను తిలకిస్తున్న ప్రేక్షకులు
అనకాపల్లి టౌన్: నాటికల ద్వారా సమాజంలో లోటుపాట్లను గుర్తించి జాగృతం చేయొచ్చని హైదరాబాద్ వై.కె.నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ చైర్మన్ బొప్పరాజు నర్సింహరావు అన్నారు. స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో వై.కె.నాగేశ్వరరావు(హైదరాబాద్), క్లబ్ సభ్యులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికలను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో సెల్ఫోన్ యువతను పట్టి పీడిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వివాహేతర సంబంధం నేరం కాదా?
వివాహేతర సంబంధం నేరం కాదని, చట్టప్రకారం ఎవరినీ శిక్షించేది లేదని ఉన్నత న్యాయస్థానం ఐపీసీ నుంచి 497 సెక్షన్ తొలగించింది. దీంతో కళ్ల ముందర భార్యాభర్తల్లో ఎవరైనా సరే మరొకరితో సంబంధం ఏర్పరచుకుంటే శిక్షించలేని నిస్సహాయత ఏర్పడింది.
కావలిస్తే ఈ కారణంగా విడాకులు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించింది. మరి నైతిక విలువల మాటేమిటి, వివాహ వ్యవస్థ పవిత్రత మాటేమిటి? మరి ఈ అక్రమ సంబంధాల ఘర్షణలో నలిగిపోతున్న పిల్లల భవిష్యత్ ఏంటి? ప్రశ్నించుకుంటే జవాబు శూన్యం. చట్టమే ఆ స్వేచ్ఛనిస్తే ఇక వీటిని ఆపేదెవరు? ఈ సమాజం ఎటు పోతోంది? దీన్ని ఎవరూ ప్రశ్నించరే? అనే ప్రశ్న నుంచి ఉదయించినదే ఈ నాటిక ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’. విశాఖపట్నం తెలుగు కళా సమితి వారు ప్రదర్శించిన ఈ నాటికకు కథ పి.టి.మాధవ్, దర్శకత్వం చలసాని కృష్ణప్రసాద్, నిర్వహణ వై.ఎస్.కె.ఎన్.స్వామి అందించారు.
‘నిర్జీవ నినాదం’
నాణానికి మరో వైపు చూపించి, విప్లవకారులు త్యజించిన వారి కుటుంబాలు కూడా సమాజంలో ఉద్ధరించబడాల్సిన భాగాలు కాదా.? ఇంటిని ఉద్ధరించలేని వారు సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయడం... ఆ ప్రయత్నం కారణంగా కుటుంబ వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన అశాంతి... అసంతృప్తి, మానసిక క్షోభ.. తాము నమ్ముకున్న వారు విప్లవం వర్ధల్లాలి అని నినదిస్తూ నిర్జీవంగా మారి కళ్ల ముందుకే వస్తే... ఆశలు చితికిపోయి, భవిష్యత్ చీకటిలోకి జారిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుల దృష్టిలో.. అమరత్వం పొందిన విప్లవం వర్ధల్లాలి అన్న నినాదమే ఒక నిర్జీవ నినాదం. ఈ నాటికను శ్రీకాకుళం జిల్లా బొరివంక శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ప్రదర్శించగా, రచన అడపా సూరిబాబు, దర్శకత్వం కె.కె.ఎల్.స్వామి, సంగీతం పి.లీలామోహన్ వహించారు.
ప్రేక్షకులను ఆలోచింపజేసిన నాటికలు
తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికలు ప్రారంభం

నిర్జీవ నినాదం నాటిక ప్రదర్శన