సాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సర్వేకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకుని బీఎల్వోలు ఇంటింటా తిరుగుతున్నప్పటికీ, ఆ సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో సర్వే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీనివల్ల అధికారులు ఒకే ఇంటికి పదేపదే తిరగాల్సి వస్తోంది. అలాగే, రాజకీయ పార్టీల పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లు కూడా సర్వే బృందాలతో పాటు ఇంటింటికి రాకపోవడంతో సర్వేలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడేరు పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం బీఎల్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించారు. ఇళ్లకు వెళ్లిన సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో, సిబ్బంది స్థానికంగా ఉన్న వారితో ఓటర్ల పేర్లను పిలిపించాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొద్దిమంది ఓటర్లకు అక్కడికక్కడే సామూహికంగా ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి కావాలంటే ఓటర్లు సహకరించాలని, అలాగే ఏజెంట్లు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సిబ్బంది కోరుతున్నారు.


