● సాయంత్రానికి పునరుద్ధరణ
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాలనీలో సాంకేతిక కారణాల వల్ల శుక్రవారం సుమారు ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీలేరు గ్రా మానికి జలవిద్యుత్ కేంద్రం వెనుక ఉన్న స్విచ్యార్డులోని 33/11 కేవీ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. గురువారం సాయంత్రం 33 కేవీ లైన్ పరిధిలోని సీటీపై కోతి ప్రమాదవశాత్తు పడటంతో, నిడిల్ కాలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జెన్కో స్విచ్యార్డు సిబ్బంది తక్షణమే స్పందించి, బైపాస్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ మేరకు ఎల్సీ అనుమతులు తీసుకుని, మధ్యాహ్నం వరకు సిబ్బంది పనులు చేపట్టారు. జెన్కో స్విచ్యార్డు సిబ్బంది, ఇంజనీర్లు శ్రమించి, కాలిపోయిన సీటీని తొలగించి కొత్త నిడిల్ను అమర్చారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి సీలేరు కాలనీకి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


