చేపల వేట సమయంలో ఘటన
ముంచంగిపుట్టు : మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ బొండ్రు గూడ గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో శుక్రవారం సాయంత్రం చేపల వేట చేస్తూ ఒక గిరిజనుడు గల్లంతయ్యాడు.అతని ఆచూకీ కోసం గిరిజనులు గాలింపు చేపట్టారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు (45) గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలోని బలిఘాట్ ప్రాంతంలో చేపల వేటలో నిమగ్నమయ్యాడు. దీనిలో భాగంగా వలను లాగుతూ ప్రమాదవశాత్తూ కాళ్లు జారి గెడ్డలో పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు హూటహూటిన మత్స్యగెడ్డ వైపు పరుగులు పెట్టి చూసేసారికి అద్దు మునిగిపోయాడు. బొండ్రుగూడ గ్రామ గిరిజనులు నాటుపడవలతో మత్స్యగెడ్డలో విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ నాని, రెవెన్యూ సిబ్బంది, మహిళా పోలీసు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో నాటు పడవలపై మత్స్యగెడ్డలో గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో నిలిపివేశారు. గల్లంతైన అద్దుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఇంటి పెద్దదిక్కు గల్లంతవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. నాటు పడవలపై గాలింపు కష్టంగా ఉన్నందున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి, గాలింపు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


