చలి గుప్పిట్లో ముంచంగిపుట్టు
● 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
● డుంబ్రిగుడలో తగ్గుముఖం
● వణికిస్తున్న శీతల గాలులు
● ఇబ్బందులు పడుతున్న మన్యం వాసులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా మరింత దిగజారుతున్నాయి.దీంతో చలి,మంచు తీవ్రతకు స్థానికులు తాళలేకపోతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ముంచంగిపుట్టులో 3.1 డిగ్రీలు, డుంబ్రిగుడలో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 4.4 డిగ్రీలు, హుకుంపేటలో 5.1 డిగ్రీలు, చింతపల్లిలో 5.2 డిగ్రీలు, పాడేరులో 5.4 డిగ్రీలు, జి.మాడుగులలో 6.5 డిగ్రీలు, కొయ్యూరులో 10.1 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 7.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 8.8 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 11.1 డిగ్రీలు, అడ్డతీగలలో 12.3 డిగ్రీలు నమోదు అయ్యాయి.
● రంపచోడవరంలో 13.8 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 12.0 డిగ్రీలు, ఎటపాకలో 12.2 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. వాహన చోదకులు ఇబ్బందులు పడుతూ ఫ్లడ్ లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు.


