
గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
రాజవొమ్మంగి: మండంలోని లాగరాయి పీహెచ్సీ పరిధిలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో కొద్ది రోజులుగా జ్వరాలతో సతమతుమవుతున్నారు. ఇందులో భాగంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఎటువంటి వైద్య సేవలందక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే సొంత పంచాయతీ అయిన కిండ్రలో ఇంటింటా జ్వరాలతో గ్రా మస్తులు మంచాన పడ్డారు.అధికారులు పట్టించుకోవడం లేదని, రోగులు వాపోతున్నారు. ఈ సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘సాక్షి’లో ఈనెల 8న ‘జ్వరాలతో సతమతం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది జ్వరపీడితులకు చికిత్స అందజేశారు. 12 మందికి రక్తపూతలు సేకరించి ల్యాబ్కు పంపారు.
ఇంటింటికి వెళ్లి ఆరా తీసిన ఏడీఎంహెచ్వో డేవిడ్
గ్రామాల్లో జ్వరపీడితుల సమస్యపై పలు పత్రికల్లో కథనం ప్రచురించడంతో రంపచోడవరం ఏడీఎంహెచ్వో డేవిడ్ స్పందించారు. ఆయన సోమవారం హుటాహుటిన లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాలకు వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. జ్వరపీడితులను కలిసి, ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం ఫీవర్ సర్వే జరుగుతోందని, రిపోర్టుల ఆధారంగా రాష్ట్ర స్థాయి వైద్యనిపుణులు ఈ ప్రాంతానికి వస్తారని, పూర్తిస్థాయిలో వైద్య సేవలందిస్తామని ఆందోళన చెందవద్దన్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో రెండు నెలల క్రిందట ఇదే సమస్య వచ్చిందని, ఫీవర్ సర్వే జరిపి 12 మందికి రక్త పరీక్షలు చేయగా ఇరువురికి చికున్గున్యా ఉన్నట్టు అప్పట్లో నిరార్థణ అయినట్టు చెప్పారు.ప్రస్తుతం విస్తృతంగా ఫీవర్సర్వే జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ జరుగుతుందని, అందరూ ఇంటా బయట స్ప్రేయింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్లు గణలక్ష్మి, సత్యవతి, మెడికల్ ఆఫీసర్లు శివప్రసాద్రెడ్డి, ఎస్తేరు రాణి, సతీష్, శరత్చంద్ర పాల్గొన్నారు.
జ్వరాలపై కలెక్టర్ స్పందన
లాగరాయి పీహెచ్సీ పరిధిలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో ప్రబలతున్న జ్వరాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కలెక్టర్ దినేష్కుమార్ స్పందించారు. ఆయా గ్రామాల్లో వెంటనే ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ విశ్వేశ్వరరావు నాయుడును ఆదేశించారు. దీంతో ఆయా గ్రామాల్లో సోమవారం వైద్య శిబిరాలు నిర్వహించి, పలువురు నుంచి రక్త నమూనాలు సేకరించినట్టు ఏడీఎంహెచ్వో విలేకరులతో చెప్పారు. రక్త నమూనాలను ల్యాబ్కు పంపి వ్యాధి నిర్ధారణను బట్టి తగిన చికిత్స అందజేస్తామని వెల్లడించారు. తీవ్రమైన జ్వరం ,ఇతర అనారోగ్య సమస్యలున్న వారు సమీపంలోని సీహెచ్సీలకు వెళ్లాలని, తక్షణమే చికిత్స అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సినది లేదని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు డీఎంఅండ్హెచ్ఓ తెలిపారు.

గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు