
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన జరిపారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
వైభవంగా నిత్యకల్యాణం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచి, ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని ఘనంగా జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.
ఘనంగా గరుడసేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ విశేషంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడవాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. భక్తులను గరుడవాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. స్వామివారి శేషవస్త్త్రాలు, ప్రసాదం అందించారు.