
గిరిజన విద్యార్థులంటే చిన్నచూపు
పాడేరు : గిరిజన విద్యార్థులంటే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు చిన్న చూపని అందుకే వారికి వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణంలోని తలార్సింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. దీనిలో భాగంగా వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులు ఉంటున్న ప్రతీ గదికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కిటికీలు, తలుపులు లేకుండా ఉండటంతో పాటు భవనాలన్నీ పూర్తిగా శిథిల దశలో ఉండటాన్ని గమనించారు. పేరుకుపోయిన చెత్త వల్ల తీవ్ర దుర్వాస రావడంపై ఆయన చలించిపోయారు. అధికారులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో పరిస్థితులను చూసి తన గుండె తరుక్కుపోయిందన్నారు. ఇలాంటి చోట గిరిజన విద్యార్థులను ఎలా ఉంచుతారన్నారు. భవనాలు పూర్తిగా శిథిల దశకు చేరినందున ఏ సమయంలో కూలుతుందో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుంటూ కాలం గడుపుతున్నారన్నారు. విద్యార్థులకు ఏమైనా జరగరానిది జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గిరిజనులంటే సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గిట్టదన్నారు. అందుకే గిరిజన విద్యార్థులు ఇలాంటి అధ్వాన పరిస్థితుల్లో ఉండాల్సి వస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసిందని, నాడు–నేడులో రూ.కోట్లు వెచ్చించి పాఠశాలలు, వసతి గృహాల రూపురేఖలను మార్చిందన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా కోసం పైసా కూడా ఖర్చుపెట్టకుండా విద్య వ్యవస్థను నాశనం చేస్తోందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు స్పందించి తలార్సింగి పాఠశాల వసతి గృహంలో మౌలిక వసతులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబుకు ఏజెన్సీలో
పర్యటించే అర్హత లేదు
సీఎం చంద్రబాబుకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించే అర్హత లేదని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. అరకులో నిర్వహించిన ఎన్నికల సభలో తాము అధికారంలోకి వస్తే జీవో నంబరు 3 పునరుద్ధరిస్తామని, స్పెషల్ డీఎస్సీ ద్వారా గిరిజనులతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, గిరిజనాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాడేరులో పర్యటిస్తే స్థానిక గిరిజనులు, తమ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు ఉన్నారు.
వసతి గృహాల్లో కనీస వసతులు కరువు
తలార్సింగి టీడబ్ల్యూ బాలుర ఆశ్రమ పాఠశాలలో పరిస్థితులు దారుణం
ప్రభుత్వం, అధికారుల తీరుపై పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపాటు

గిరిజన విద్యార్థులంటే చిన్నచూపు