
ఇళ్ల బిల్లులు తక్షణమే చెల్లించాలి
పాడేరు : పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాల బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక గిరిజన సంఘ కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి అందోళన చేపట్టారు. అధికారుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స మాట్లాడారు. పాడేరు డివిజన్లో 18,753 మంది లబ్ధిదారులకు బకాయి పడిన రూ.25 కోట్లను తక్షణమే చెల్లించాలన్నారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 34,570 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాటి నిర్మాణ వ్యయాన్ని పెంచనందున లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బిల్లులు జమ అయితే గృహ నిర్మాణ శాఖలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలావుండగా ఆందోళన విషయం తెలుసుకున్న డీఆర్వో పద్మలత అక్కడికు వచ్చి వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రూ.25 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రారంభించామని రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆమె చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్, నాయకులు పాలికి లక్కు, కొర్రా త్రినాఽథ్, ఎంఎం శ్రీను, హైమవతి పాల్గొన్నారు.
పీఎం జన్మన్ లబ్ధిదారుల డిమాండ్
ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరులో ఆందోళన
ఐటీడీఏ వరకు భారీగా ర్యాలీ
ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన
ఖాతాల్లో జమచేస్తున్నామని
డీఆర్వో హామీతో ఆందోళన విరమణ