వరదలను సమర్థంగా ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

వరదలను సమర్థంగా ఎదుర్కొందాం

Jun 28 2025 8:07 AM | Updated on Jun 28 2025 8:11 AM

చింతూరు: రానున్న కాలంలో చింతూరు డివిజన్లో వరదలు సంభవిస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన వరద సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులంతా క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. వరద బాధితులకు ఆయా గ్రామాల సమీపంలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారిని తరలించేందుకు లాంచీలు, పడవలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరదలను దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకోవాలని, పునరావాస కేంద్రాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, మలేరియా ప్రబలకుండా స్ప్రేయింగ్‌ చేయించాలని, వైర్‌లెస్‌ సెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వరదల సమయంలో విద్యుత్‌శాఖ సిబ్బంది అప్రమత్తంగా వుండాలన్నారు. ఈ సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌, రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, అసిస్టెంట్‌ కలెక్టర్‌ నాగ వెంకటసతీష్‌, ఏఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా, డీఎఫ్‌వో బబిత, ఏపీవో జగన్నాథరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అంబేడ్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి నందు, జిల్లా ఉద్యానశాఖ అధికారి రమేష్‌ పాల్గొన్నారు.

సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు

వరదలు సంభవిస్తే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 80 పునరావాస కేంద్రాలు, 40 బోట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు మండలాల్లో 10 స్టాక్‌పాయింట్లు ఏర్పాటుచేసి రహదారి మార్గంగుండా రేషన్‌, నిత్యావసర సరకులు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరదల సమయంలో కూనవరం నుంచి ఏడుగురాళ్లపల్లి మీదుగా భద్రాచలం వెళ్లేలా ప్రత్యామ్నాయ రహదారులు త్వరితగతిన పూర్తిచేసేందుకు అటవీశాఖ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. వరదలకు ముందుగానే మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఆయా మండాలకు తరలించి ఉంచుతామన్నారు. వరదల్లో ఎలాంటి నష్టంలేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని ఆయన సూచించారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణాల కొరకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరితగతిన వాటిని నిర్మించి వచ్చే ఏడాది వరదల కంటే ముందుగానే నిర్వాసితులను కాలనీల్లోకి తరలిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

వరదలను సమర్థంగా ఎదుర్కొందాం1
1/1

వరదలను సమర్థంగా ఎదుర్కొందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement