
వర్షాలకు కూలిన భారీచెట్టు
● అంతర్ రాష్ట్ర రహదారిలో ఐదు గంటల పాటు నిలిచిన రాకపోకలు
● స్థానిక గిరిజనుల సహకారంతో
తొలగించిన ప్రయాణికులు, సిబ్బంది
సీలేరు: అంతర్ రాష్ట్ర రహదారిలో గూడెం కొత్తవీధి మండలం లంకపాకలు వద్ద భారీ చెట్టు కూలడంతో రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో భారీ వృక్షం రహదారిపై కూలడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే రెండు బస్సులు నిలిచిపోయాయి. సమీప గిరిజన గ్రామ గిరిజనుల సహకారంతో చెట్టును తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు ఐదు గంటల పాటు కారు చీకట్లో నరకయాతన అనుభవించామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.