మా త్యాగానికి ఫలితం ఇదా? | - | Sakshi
Sakshi News home page

మా త్యాగానికి ఫలితం ఇదా?

May 26 2025 1:16 AM | Updated on May 26 2025 1:16 AM

మా త్

మా త్యాగానికి ఫలితం ఇదా?

చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేస్తున్నా తమపట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతితో మమేకమై జీవిస్తున్న తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం జీవితాలను త్యాగం చేస్తున్నా తమ త్యాగానికి తగిన ప్రతిఫలం మాత్రం దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు. పునరావాస ప్రక్రియలో తమకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు.

● పోలవరం ముంపులో భాగంగా ఫేజ్‌–1బీలోని 32 గ్రామాలకు చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఆయా గ్రామాల్లో గ్రామసభలు పూర్తిచేసిన అధికారులు డ్రాఫ్ట్‌ ఆర్‌అండ్‌ఆర్‌ నిర్వహించి పునరావాసంతో పాటు పరిహారం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

● గిరిజనులకు రంపచోడవరం డివిజన్‌లోని గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, రంపచోడవరం ప్రాంతాల్లోనూ, గిరిజనేతరులకు గోకవరం సమీపంలోని సూదికొండ, మల్లవరం, తాడువాయి, తిరువూరు ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మించేందుకు అభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు.

● ఫేజ్‌–1బీలో భాగంగా కూనవరం మండలంలో 3,983 కుటుంబాలు, వీఆర్‌పురం మండలంలో 5,141 కుటుంబాలు, చింతూరు మండలంలో 3,380 కుటుంబాలకు పునరావాస కల్పించాల్సి ఉంది.

గిరిజనేతరులకు మూడు ఆప్షన్లు

● పునరావాసం కల్పించే ప్రాంతంలో గిరిజనులకు ప్రభుత్వమే ఐదుసెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తుండగా గిరిజనేతరులకు మాత్రం మూడు ఆప్షన్లు కల్పిస్తున్నారు. వీటిలో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఐదుసెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వడం మొదటిది. ఐదుసెంట్ల స్థలం ఇస్తే నిర్వాసితులే స్వయంగా ఇల్లు నిర్మించుకోవడం దీనికోసం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ 2.85 లక్షలు ఇవ్వడం రెండోది. స్థలం, ఇంటి నిర్మాణం వద్దనుకునే వారికి రూ 3.85 లక్షలు అందచేయడం మూడో ఆప్షన్‌. అధికశాతం మంది గిరిజనేతరులు రెండో ఆప్షన్‌ అయిన ఐదుసెంట్ల స్థలం తీసుకుని సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్వయంగా నిర్మించుకోలేని వారు ప్రభుత్వమే ఇళ్లు కట్టి ఇవ్వాలని కోరుతుండగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే వారు తమకు స్థలం, ఇల్లు వద్దని మొత్తం సొమ్ము తీసుకునేందుకు చూస్తున్నారు.

పాతధరల ప్రకారం పరిహారమా?

● పునరావాస ప్రాంతంలో సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాలనే వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.2.85 లక్షలు ఎలా సరిపోతాయని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎప్పుడో పాతధరల ప్రకారం పరిహారం ఇస్తామనడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు.

● పునరావాస కాలనీల్లో ఐదుసెంట్ల స్థలం ఇస్తున్న ప్రభుత్వం అందులో ఒక సెంటులో మాత్రమే ఇల్లు నిర్మిస్తోందని, బెడ్‌ రూం, కిచెన్‌, వరండాతో నిర్తిస్తున్న ఇల్లు చాలా చిన్నదిగా ఉంటోందని, దానిలో ఎలా నివాసముండాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.

● ఐదుసెంట్ల స్థలం ఇస్తున్న ప్రభుత్వం కనీసం రెండు సెంట్లలోనైనా కొంచెం విశాలంగా ఇల్లు నిర్మిస్తే బాగుండేదని, లేదంటే సొంతంగా నిర్మించుకునే వారికి కనీసం రూ 6 లక్షల వరకు ఇస్తే మంచి ఇల్లు కట్టుకునే అవకాశముంటుందని వారు అంటున్నారు. సర్వస్వం కోల్పోతున్న తమకు ప్రభుత్వం తమ త్యాగాలను అర్థంచేసుకుని మంచి పునరావాసం కల్పిస్తే సంతోషంగా తరలి వెళ్తామని నిర్వాసితులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం కట్టిస్తే కనీసం రెండు సెంట్లలో విశాలంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, స్వ యంగా కట్టుకుంటానంటే ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఇళ్ల నిర్మాణానికి

చాలీచాలని పరిహారం

ఏమాత్రం సరిపోదంటున్న

పోలవరం నిర్వాసితులు

మరింత పెంచి ఇవ్వాలని

ప్రభుత్వానికి వేడుకోలు

రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశాం.స్థిర, చర ఆస్తులను వదులుకున్నాం. గ్రామాలతో అనుబంధం తెంచుకుంటున్నాం. దిగువ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు తమ జీవితాలను

ధారాదత్తం చేసినా.. ప్రభుత్వం నుంచి సరైన ప్రతిఫలం దక్కడం లేదని

నిర్వాసితులు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తున్న చాలీచాలని

పరిహారాన్ని మరింత పెంచాలని ప్రభుత్వానికి వారు విన్నవించుకుంటున్నారు.

ఇల్లు విశాలంగా నిర్మిస్తేనే మేలు

పునరావాస కాలనీల్లో ప్రభుత్వం నిర్మించే ఇంటిని విశాలంగా నిర్మించి ఇవ్వాలి. ప్రస్తుతం పునరావాస కాలనీల్లో నిర్మించి ఇళ్లు చాలా చిన్నగా ఉన్నాయి. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మిస్తే కుటుంబం నివసించేందుకు వీలుగా ఉంటుంది.

– మాదిరెడ్డి బోసు, ధర్మతాళ్లగూడెం,

వీఆర్‌పురం మండలం

రూ.6 లక్షలు ఇస్తే బాగు

సొంతంగా ఇంటిని నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ 2.85 లక్షలు మాత్రమే ఇస్తాననడం సరికాదు. ప్రస్తుతం సిమెంటు, ఇటుక, ఐరన్‌తో పాటు కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి. కనీసం రూ 6 లక్షలు ఇస్తే ఉపయోగకరం.

– ఇమ్మంది సుబ్బారావు, కూనవరం

మా త్యాగానికి ఫలితం ఇదా? 1
1/3

మా త్యాగానికి ఫలితం ఇదా?

మా త్యాగానికి ఫలితం ఇదా? 2
2/3

మా త్యాగానికి ఫలితం ఇదా?

మా త్యాగానికి ఫలితం ఇదా? 3
3/3

మా త్యాగానికి ఫలితం ఇదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement