శరవేగంగా తాగునీటి ఎద్దడి నివారణ పనులు | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా తాగునీటి ఎద్దడి నివారణ పనులు

May 14 2025 1:30 AM | Updated on May 14 2025 1:30 AM

శరవేగంగా తాగునీటి ఎద్దడి నివారణ పనులు

శరవేగంగా తాగునీటి ఎద్దడి నివారణ పనులు

మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన రూ.31 కోట్ల నిధులతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జల జీవన్‌ మిషన్‌ పనులు కూడా జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించినట్టు ఆమె తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకంలో మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కోదానికి సుమారు రూ.74 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు.

దోమల బెడద నివారించండి:

అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్‌ చేపట్టాలని అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఏజెన్సీలో 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశాల్లో దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించారు. సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్‌, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌

జల్లిపల్లి సుభద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement